IPL 2024: పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం
అద్భుతంగా పోరాడిన పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ.. అయినా తప్పని ఓటమి;
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 9 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైని వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకొచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీయగా.. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
ముంబైకి రబాడా మూడో ఓవర్లోనే కిషన్ (8)ను ఔట్ చేసి తొలి షాకిచ్చినా సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో 250వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్తో కలిసి సూర్య మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి రావడంతోనే బౌండరీల వేట మొదలుపెట్టిన సూర్య.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. హిట్మ్యాన్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్స్లోకి పంపాడు. అర్ష్దీప్ వేసిన నాలుగో ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కరన్ వేసిన 12వ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద హర్ప్రీత్తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను అందుకోవడంతో రోహిత్ ఔటయ్యాడు. ఈ జోడీ రెండో వికెట్కు 57 బంతుల్లోనే 81 పరుగులు జోడించింది. రోహిత్ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ (34 నాటౌట్)తో కలిసి సూర్య బాదుడు కొనసాగించాడు. రబాడా ఓవర్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 18 రన్స్ పిండుకున్నారు. 28 బంతుల్లోనే 49 పరుగులు జతచేసిన ఈ జోడీని 17వ ఓవర్లో కరన్ విడదీశా డు. హార్దిక్ పాండ్యా (10) మరోసారి విఫలమయ్యాడు.
భారీ ఛేదనలో పంజాబ్.. తొలి ఓవర్ వేసిన గెరాల్డ్ కొయెట్జీ.. ప్రభ్సిమ్రన్ను ఔట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. రెండో ఓవర్ వేసిన బుమ్రా.. రెండు కీలక వికెట్లు తీసి ఆ జట్టు కోలుకోనీయకుండా చేశాడు. నాలుగో బంతికి రూసో (1)ను యార్కర్తో క్లీన్బౌల్డ్ చేసిన అతడు.. ఆఖరి బంతికి కరన్ను పెవిలియన్కు పంపాడు. ప్రమాదకర లివింగ్స్టోన్ (1) కొయెట్జీ మూడో ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు 2.1 ఓవర్లలో 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హర్ప్రీత్ (13)ను స్పిన్నర్ శ్రేయస్ ఏడో ఓవర్లో పెవిలియన్కు పంపాడు.
గత మూడు మ్యాచ్లలో పంజాబ్ బ్యాటింగ్కు వెన్నెముకగా మారిన అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ మరోసారి పంజాబ్ను ఆదుకున్నారు. శశాంక్.. శ్రేయస్ 9వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అశుతోష్ ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్గా మలిచాడు. షెపర్డ్ 10వ ఓవర్లో 4,6 చెలరేగాడు. ఈ ఇద్దరి దూకుడుతో లక్ష్యం దిశగా సాగుతున్న పంజాబ్ను బుమ్రా మరోసారి దెబ్బకొట్టాడు. 13వ ఓవర్లో రెండోసారి బౌలింగ్కు వచ్చిన బుమ్రా.. శశాంక్ను ఔట్ చేయడంతో 34 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ శశాంక్ ఔట్ అయినా అశుతోష్ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. తనదైన షాట్లతో అభిమానులను హోరెత్తించాడు. ఈ క్రమంలో అతడు హర్ప్రీత్ బ్రర్ అండగా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు.