రెస్టాఫ్ ఇండియా, ముంబయి మధ్య జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యం సంపాదించిన ముంబయి విజేతగా నిలిచింది. 27 ఏళ్ల తర్వాత ముంబయి ఈ ట్రోఫీ సాధించడం విశేషం. ఓవరాల్గా ఆ జట్టు 15వసారి విజేతగా నిలిచింది. ఐదో రోజు 153/6తో ఆట కొనసాగించిన ముంబయి.. 329/8తో నిలిచింది. ముంబయి రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్లో తనుష్ కొటియన్ (114 నాటౌట్), పృథ్వీషా (76), మోహిత్(51 నాటౌట్) పరుగులు చేశారు. తనుష్, మోహిత్ జోడీ తొమ్మిదో వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే, మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగిస్తున్నట్లు ప్రకటించారు. సర్ఫరాజ్ (222 నాటౌట్) డబుల్ సెంచరీకి తోడు అజింక్య రహానె(97), శ్రేయస్ అయ్యర్(57) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో ముంబయి 537 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్టాఫ్ ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (191) త్రుటిలో ద్విశతకం చేజార్చుకోగా.. ధ్రువ్ జురెల్ (93) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించిన ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.