Cricket : టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడటమే నా కల: రింకూ సింగ్

Update: 2025-09-01 08:15 GMT

ఆసియా కప్‌కు ముందు అద్భుతమైన ఫామ్‌తో ఉన్న టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ రింకూ సింగ్, తన క్రికెట్ భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. యూపీ టీ20లో సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చిన రింకు సింగ్, తనకు అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ముఖ్యంగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడాలనేదే తన కల అని వెల్లడించాడు.

తనను కేవలం టీ20 ప్లేయర్‌గా చూడటం ఇష్టం లేదని రింకూ సింగ్ చెప్పాడు. "నేను వన్డేల్లో అరంగేట్రం చేశాను. రెండు మ్యాచ్‌లలో ఒకదాంట్లో బాగా ఆడాను. ఏ ఫార్మాట్‌లో అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నన్నెప్పుడూ మూడు రకాల క్రికెట్ ఆడగలిగే ప్లేయర్‌గానే భావిస్తాను. టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడాలనేదే నా కల. నాకు అవకాశం వస్తే తప్పకుండా అందిపుచ్చుకుంటాను" అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.

సురేశ్ రైనా నా మార్గదర్శి

తన క్రికెట్ ప్రయాణంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తనకు మార్గదర్శి అని రింకూ సింగ్ తెలిపాడు. "సురేశ్ రైనా నాకు మార్గదర్శి. అతడు నా అభిమాన క్రికెటర్. ఎప్పుడూ నాకు ఒక మాట చెబుతుంటాడు.. రింకూ.. ప్రతి అవకాశం కోసం సిద్ధంగా ఉండాలి. అందుకు సన్నద్ధమై ఉండాలి' అనేది రైనా మాట. టెస్టుల్లో నావంతు భాగస్వామ్యం అందిస్తే చాలా సంతోషిస్తా. నేను ఇప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నానో, ఇదే స్థానంలో సురేశ్ రైనా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. నేను కూడా అలాంటి క్రికెటర్‌ను కావాలని కోరుకుంటున్నాను" అని రింకూ వివరించాడు.

Tags:    

Similar News