వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024 (సీపీఎల్)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. టీ20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుక్రవారం బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మహ్మద్ రిజ్వాన్ (2,036 పరుగులు.. 45 ఇన్నింగ్స్లు.. 2021) రికార్డును బ్రేక్ చేశాడు. నికోలస్ పూరన్ ఈ ఏడాది ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్ల్లో 2,059 పరుగులు చేశాడు. అతడు ఈ సంవత్సరంలో టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్పూర్ రైడర్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించి 14 అర్ధ సెంచరీలు సాధించాడు. రెండుసార్లు 90కిపైగా పరుగులు చేశాడు.