KOHLI: దేవుడి సరసన భక్తుడు
వన్డేల్లో 49వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... సచిన్ రికార్డు సమం చేసిన కింగ్;
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న 49వ సెంచరీని ఎట్టకేలకు తన 35వ పుట్టిన రోజున అందుకున్నాడు. 49 సెంచరీలతో సచిన్తో సమానంగా నిలిచి తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. వైఫల్యాల మధ్యే మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్ కోహ్లీ... ఈ పుట్టిన రోజున తాను ఎంతో ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి తనకు తానే మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో ఈ ఘనత సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచకప్ కల నెరవేర్చుకునేందుకు రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో... నాకౌట్ పోరులో అద్భుత శతకంతో కోహ్లీ చెలరేగి కప్పుతో పాటు సచిన్ రికార్డును బద్దలు కొడితే భారత క్రికెట్ అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
పదిహేనేళ్ల కెరియర్లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్లో 79 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 49, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు విరాట్ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 50 సెంచరీల రికార్డును ఈ ప్రపంచకప్లోనే కోహ్లీ సాధించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాది పది సెంచరీలు చేసి శతకాలు సాధించడం ఇంత తేలికా అనేలా చేశాడు కోహ్లీ. వన్డేల్లో 2017, 2018 సంవత్సరాల్లో ఆరు చొప్పున 12 శతకాలు బాదాడు. 2012, 2019లో ఐదు చొప్పున శతకాలు కొట్టాడు. ఇక టెస్టుల్లోనూ 2017, 2018లో ఐదేసి చొప్పున 10 శతకాలు కొట్టాడు. ఇటీవల టీ20ల్లో తొలి సెంచరీని అఫ్గానిస్తాన్పై నమోదు చేశాడు. 2014లో టెస్టులకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో సారథిగా కోహ్లీ ఎంపికయ్యాడు. 2017లో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్గా ఉన్నప్పుడే ఎక్కువగా పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. టెస్టుల్లో 68 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు కోహ్లీ. అందులో 40 మ్యాచ్లు టీమిండియా గెలిచింది. 17 ఓడిపోగా, 11 డ్రాగా ముగిశాయి. వన్డేల్లో 95 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా.. 65 గెలిపించాడు. టీ20 ల్లో 50 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించి 30 గెలిపించాడు.