China Open: భారత షట్లర్లకు షాక్
చైనా ఓపెన్ తొలిరౌండ్లోనే ప్రణయ్ ఓటమి.... లక్ష్యసేన్, రజావత్కు తప్పని ఓటమి.. మహిళల డబుల్స్లోనూ ముగిసిన భారత్ పోరాటం..;
చైనా ఓపెన్(China Open 2023) పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్లకు షాక్ తగిలింది. మొదటి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు ఇంటి దారి పట్టారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ (HS Pranay), లక్ష్య సేన్(Lakshya Sen), ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) ఓటమి పాలయ్యారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిసి ఫేవరెట్గా బరిలోకి దిగిన హెచ్.ఎస్.ప్రణయ్ (HS Prannoy) తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 22వ ర్యాంకర్, మలేషియాకు చెందిన యాంగ్ చేతిలో.. ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. గంట ఆరు నిమిషాలపాటు జరిగిన పోరులో ప్రణయ్ 12-21 21-13 18-21 తేడాతో పరాజయం చవిచూసి తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మరోమ్యాచ్లో కామన్వెల్త్ ఛాంపియన్ లక్ష్య సేన్కు డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటోన్సేన్ ఝలక్ ఇచ్చాడు. గంట 18 నిమిషాల పాటు జరిగిన పోరులో సేన్ 21-23, 21-16, 9-21తో పరాజయం చెందాడు. గంట 18 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్ మొదటి రెండు గేమ్ల్లో గట్టిగానే పోరాడినప్పటికీ నిర్ణయాత్మక మూడో గేమ్లో చేతులేత్తేశాడు.
ఇండోనేషియకు చెందిన షెసర్ హిరెన్తో జరిగిన పోరులో యువ కెరటం ప్రియాన్షు రజావత్ 13-21, 24-26 తేడాతో ఓడిపోయాడు. ముగ్గురు స్టార్ ఆటగాళ్ల ఓటమితో చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
మహిళల డబుల్స్లోనూ భారత పోరాటం ముగిసింది. త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ జోడీ చైనాకు చెందిన చెన్ కింగ్ చెన్, జియా యూ ఫాన్ చేతిలో 18-21, 11-21తో ఓటమి పాలైంది. ఒలింపిక్ విజేత పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. చైనా వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్కు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో వీళ్లిద్దరూ వైదొలిగారు.