ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో శ్రీలంక జట్టు ఆటగాళ్లు సత్తా చాటారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. ఇక, భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు ఒక్కో స్థానం మెరుగుపర్చుకున్నారు. తాజా ర్యాంకింగ్స్లో ఈ ముగ్గురు వరుసగా.. 5, 6, 7 స్థానాలకు ఎగబాకారు. వీరితో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని టాప్-10లో కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు.. 8, 9, 10 వరుస స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ లు.. వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు.
లంక ఆటగాళ్ల హవా
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో సత్తా చాటిన లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే టెస్ట్లో రాణించిన కమిందు మెండిస్ 6 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన పథుమ్ నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ..!
బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ లంక బౌలర్లు సత్తా చాటారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
జడ్డూ@1.. అశ్విన్@2
టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ 6 స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ జాబితాలో లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు.