TEAM INDIA: పాతాళానికి పడిపోయిన ఫీల్డింగ్ ప్రమాణాలు
358 రన్స్ చేసిన ప్రతీసారి ఓటమే... చెత్త ఫీల్డింగ్తో ఓడిన భారత జట్టు.. రోజురోజుకు దిగజారుతున్న ఫీల్డింగ్
[భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రాయ్పూర్ వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా అందించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానే సఫారీలు ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి సెంచరీలు వృథా అయ్యాయి. ఈ మ్యాచ్లో బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు, ఫీల్డర్లు విఫలమవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మరీ ఇంత చెత్తగానా..?
రాయ్పూర్ వన్డేలో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యమే ఓటమికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. బౌండరీ లైన్ వద్ద ఎయిడెన్ మర్కరమ్ ఈజీ క్యాచ్ను యశస్వి జైస్వాల్ డ్రాప్ చేశాడు. మర్కరమ్ హాఫ్ సెంచరీ తర్వాత సిక్సర్కు ప్రయత్నించాడు అయితే అది నేరుగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఆ క్యాచ్ను జైస్వాల్ వదిలేశాడు. ఆ సమయంలో మర్కరమ్ స్కోర్ 53 పరుగులు కాగా, మర్కరమ్ కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా మారాడు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం కూడా టీమిండియా ఫీల్డింగ్ మిస్టేక్కు ఒక కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద బాల్ని అంచనా వేయడంలో భారత ఫీల్డర్లు విఫలమయ్యారు. దాంతో అనవసరంగా పరుగులు వచ్చాయి. రవీంద్ర జడేజా లాంటి ఫీల్డర్లు సైతం మిస్టేక్స్ చేయడం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు కూడా తేలిపోయారు. అర్ష్దీప్ సింగ్ మినహా మిగతా ఏ బౌలరూ రాణించలేదని చెప్పొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఏకంగా ఓవర్కి 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.
తేలిపోయిన బౌలర్లు
హర్షిత్ రాణా కూడా ఏడు పరుగులు ఇచ్చాడు. వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ పది ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, హర్షిత్ రాణా 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్, అర్ష్దీప్ సింగ్ 54 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.