ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ రెడ్డి పై వేటు వేశారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఉత్తర్వులను చంచల్ గూడా జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూశాఖ అధికారులు అందజేయనున్నారు.
గతవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న స్మితా సబర్వాల్ ఇంట్లోకి రాత్రి 11.30 గంటల సమయంలో చొరబడ్డాడు ఆనంద్ రెడ్డి. స్నేహితుడితో కలిసి సబర్వాల్ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలోకి కారులో వెళ్లాడు. స్నేహితుడిని కారులోనే ఉంచి ఆనంద్ రెడ్డి ఒక్కడే సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించాడు.
అర్దరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి రావడంతో స్మితా సబర్వాల్ కంగారు పడ్డారు. ఎవరు నువ్వు, ఈ టైంలో ఇంట్లోకి ఎలా వచ్చావ్ అని ప్రశ్నించారు. తాను డిప్యూటీ తహసీల్దార్ ను అని చెప్పకుండా, గతంలో రెండు సార్లు 'ట్వీట్' చేశానని ఆనంద్ రెడ్డి చెప్పడంతో.. భయానికి గురైన సబర్వాల్ కేకలు వేశారు. భద్రతా సిబ్బంది తేరుకుని ఆనంద్ రెడ్డిని, కారులో ఉన్న అతని స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు, ఆనంద్ రెడ్డితో పాటు అతని స్నేహితుడిని రిమాండ్ కు తరలించారు. ఉద్యోగం విషయంపై మాట్లాడేందుకు వస్తే తనను అరెస్ట్ చేశారని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు.
ఈ ఘటనపై స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు...
"అంత్యంత బాధాకరమైన అనుభవం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అర్థరాత్రి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. రాత్రి వేల తలుపులను ప్రతీ ఒక్కరు స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర సరిస్థితులలో డయల్ 100కు ఫోన్ చేయాలి" అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.