TS : పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
ఉ. 11 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ;
పంద్రాగస్టు వేడుకలకు గోల్కొడ కోట ముస్తాబయ్యింది.. స్వాతంత్ర్య దినోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.. ఇప్పటికే పోలీసుల రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. కోటలో పోలీసు అధికారులు భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు. రేపు ఉదయం జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.
చారిత్రక గోల్కొండ కోటలో మువ్వన్నెల జెండా పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణ జరుగుతోంది.. ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు.. రేపు ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
వేడుకల్లో 12 వందల మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.. పంద్రాగస్టు వేడుకల కోసం వచ్చే అతిథులు, ప్రజల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.. కోటలో మొత్తం 14 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జలమండలి లక్ష వాటర్ ప్యాకెట్లు, 25వేల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచనుంది. 2వేల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. గోల్కొండ ప్రాంతంలో ఉదయం 7గంట నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని అధికారులు తెలిపారు.