TS: తెలంగాణలో 77 వేల రేషన్కార్డులు రద్దు..!
అనర్హుల రేషన్ కార్డుల రద్దు దిశగా ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ప్రభుత్వ చర్యలు.. 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పరిశీలన చేపట్టి, దాదాపు 77 వేల మందిని రేషన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించింది. వీరందరి కార్డులను రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గత కొన్ని నెలలుగా అనుమానాస్పద రేషన్ కార్డులపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది. దీంతో సుమారు 76,842 మంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించబోతున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన ఒక జాబితా. ఇందులో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. వీటిలో 1,62,773 మంది లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కలెక్టర్లు, రెవెన్యూయంత్రాంగంతో కలిసి మండల స్థాయిలో ప్రత్యక్షంగా విచారణ చేపట్టింది. స్థానిక సర్వేల ద్వారా డోర్ టూ డోర్ వెరిఫికేషన్ నిర్వహించి, రేషన్ పొందేందుకు అనర్హులైన వారి వివరాలను గుర్తించింది.
అనర్హుల జాబితా సిద్ధం.?
విచారణలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరణించిన వారు, ఇద్దరు వ్యక్తుల పేర్లతో రెండు రేషన్ కార్డులు కలిగినవారు, అలాగే ఇతర ప్రభుత్వ పథకాల నుంచి మేలు పొందే రకాలుగా ఉండి, రేషన్ అర్హత కోల్పోయినవారు ఉన్నారు. వీరి పేర్లు తొలగించి, వాటికి కేటాయించిన రేషన్ నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అనర్హుల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందినవారు ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో చిరునామా మారినప్పటికీ దానిని అప్డేట్ చేయకపోవడం వల్ల అనేక మంది అటోమేటిక్గా అనర్హులుగా నమోదు అయ్యారు. నిజమైన లబ్ధిదారులు తమ సమాచారం సరిచేసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉంది. అన్యాయంగా కార్డు రద్దైనట్టుగా భావించే వ్యక్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసి తిరిగి సరిచేసుకునే అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక మెకానిజం అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, “అర్హతలతో నిజమైన లబ్ధిదారులకే నిధులు, రేషన్ అందాలని మా లక్ష్యం. పేదవారి రేషన్ను అపహరిస్తూ వస్తున్న అర్హత లేని కార్డులను తొలగించేందుకు ఈ చర్యలు అవసరం అయింది” అన్నారు. భవిష్యత్తులో ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకం పెంచి, రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చనున్నట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వం ఖర్చులను తగ్గించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులు తప్పిదంగా రేషన్ కోల్పోకుండా అధికార యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాలని ప్రజలు కోరుతున్నారు.