Hyderabad: ఇండియా గెలిచిన ఆనందంలో మందు పార్టీ.. గుండెపోటుతో పోయిన ప్రాణం..
Hyderabad: గేమ్ గెలిచిన ఆనందంలో రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయాన్నే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు..
Hyderabad: గేమ్ గెలిచిన ఆనందంలో రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయాన్నే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.. ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆసియా కప్లో పాకిస్థాన్పై ఇండియా గెలిచిందన్న ఆనందంలో మద్యం సేవించి రాత్రి పొద్దుపోయే వరకు డ్యాన్స్లు చేశారు. ఉదయాన్నే చాతి నొప్పితో యువకుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన ప్రకాష్ (26) నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అంజయ్య నగర్లోని పద్మా నిలయంలో ఉంటున్నాడు. కొండాపూర్లోని ఎయిర్టెల్ డీటీహెచ్లో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూశారు. ఇండియా గెలవడంతో స్నేహితులతో కలిసి తెల్లవారు జామున 2 గంటల వరకు మద్యం తాగి డ్యాన్స్ చేశారు.
ఆ సమయంలో చాతిలో నొప్పిగా ఉందని చెప్పిన ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్ర లేచిన అతడు కొద్దిసేపు వాకింగ్ చేసి మళ్లీ ఛాతిలో నొప్పి వస్తుందని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తరువాత కొద్ది సేపటికి స్నేహితులు అతడిని లేపేందుకు యత్నించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.