ACB: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త మలుపు
కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ... ఈ నెల 28న విచారణకు హాజుకావలంటూ పిలుపు;
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ తన నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇప్పటికే వీరిని.. అలాగే కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. గతంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగినా.. అది జరగలేదు. కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ మౌనంగా ఉంది. ఇప్పుడు ఏకంగా కేటీఆర్కే నోటీసులు జారీ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. డటంతో.. ఈ నోటీసుల జారీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నోటీసులపై స్పందించిన కేటీఆర్
ఫార్ములా ఈ- కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. ఈ నెలాఖరులో యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున.. తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ బదులిచ్చారు. **‘‘**రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్నారు. 48 గంటల క్రితం ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు వచ్చింది. 24 గంటల క్రితమే ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలను రేవంత్ కలిశారు. ఇవాళ నాకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయి. మనీలాండరింగ్లో రేవంత్ ప్రమేయంపై భాజపా నుంచి ఒక్క మాట కూడా లేదు. రేవంత్రెడ్డి నాయకుడిగా, పాలకుడిగా విఫలమయ్యారు. అందుకే ఆయన కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నోటీసులపై ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారమిచ్చినట్లు ఆయన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు వచ్చిన 48 గంటల్లోనే, తనకు ఏసీబీ నోటీసులు రావడం ప్రతీకార చర్యే అని కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని పునరుద్ఘాటించారు.