ACB: అవినీతి సంపాదన అక్షరాల రూ.600 కోట్లు..?
భారీగా ఈఎన్సీ మురళీధర్రావు అక్రమాస్తులు.. ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు, విల్లాలు... మార్కెట్ విలువ రూ.600 కోట్లని అంచనా;
తెలంగాణ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే మురళీధర్ రావు అక్రమాస్తులు చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులే నిశ్చేష్టులు అయ్యారు. హైదరాబాద్తో పాటు 11 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ. 600 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. ఇందులో మోకిలలో 1.5 ఎకరాల స్థలం, 11 ఎకరాల పొలం, పలు విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయి. జూబ్లీహిల్స్, మోకిల, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్, కోదాడతో సహా మొత్తం 11 ప్రాంతాల్లో ఆయనకు, ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. మురళీధర్రావు అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ. 600 కోట్లను మించి ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
బంధువుల పేరు మీద...
కరీంనగర్లో మురళీధర్రావు సోదరుడు డాక్టర్ రామ్మోహన్రావు, సమీప బంధువు రవీందర్రావు ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అలాగే, మురళీధర్రావు కుమారుడు అభిషేక్కు చెందిన హనుమకొండలోని సహస్ర ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అమ్మో.. ఎన్ని అక్రమాస్తులో
హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం (దాదాపు ఎకరంన్నర), హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, కోకాపేట, బేగంపేటల్లో నాలుగు ఫ్లాట్లు, కొండాపూర్లో ఒక విల్లా, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇంటి స్థలాలు, హైదరాబాద్, కరీంనగర్లలో రెండు కమర్షియల్ క్లాంపెక్స్లు, కోదాడలో ఒక అపార్ట్మెంట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 KV సోలార్ పవర్ ప్రాజెక్టు , మెర్సిడెస్ బెంజ్తో సహా మూడు కార్లు ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. మురళీధర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ENC జనరల్గా పదవీ విరమణ పొందినా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన పదవీకాలాన్ని పదేళ్లపాటు పొడిగించుకున్నారు. ఈ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొంతకాలం కొనసాగారు. పదవీ విరమణ తర్వాత 13 ఏళ్లపాటు నీటిపారుదల శాఖలోనే పనిచేశారు. ఈ కాలంలోనే ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది.