ములుగు జిల్లాలో వర్షాలు వరద లు భీభత్సం సృష్టించాయి. ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో 8 మంది మృతి చెందారు. వరదలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. 250 కుటుంబాలు నిరాశ్రులయ్యాయి. నిత్యావసర వస్తువులైన బియ్యం, వడ్లు, డబ్బులు సర్వం వరదల్లో కొట్టుకొని పోయాయి. కట్టు బట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంత జరిగినా తమను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి ఆదుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందించలేదన్నారు. కేవలం స్వచ్ఛంద సంస్థలు మాత్రమే వచ్చి ఆదుకుంటున్నాయన్నారు వరద బాధితులు.
సర్వం కోల్పోయిన తమకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఆర్థికంగా సహాయం అదించాలంటున్నారు వరద బాధితులు. రాకపోకలు లేకపోవడంతో కొండాయి, మల్యాల గ్రామాల ప్రజలకు ఏటూరు నాగారం మండలం లోని పునరావాస కేంద్రమైన బాలికల డిగ్రీ కళాశాల వసతి గృహానికి తరలించారు. ఐటిడీఏ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, బియ్యం,దుప్పట్లు పంపిణీ చేశారు. వీరికి భోజన సౌకర్యం తో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పరిస్థితి కుదటపడే వరకు...వరదబాధితుల్ని పునరావాస కేంద్రాల్లో ఉంచుతామన్నారు అధికారులు.