శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. సహాయక చర్యల్లో భాగంగా మృతదేహం ఆనవాళ్లను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మట్టిని తొలగించి మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అధికారుల అనుమతితో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని అంబులెన్సులో తరలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మొత్తం 8 మంది చిక్కుకోగా, మూడు వారాల కిందట టన్నెల్ బోరింగ్ మేషిన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. అప్పటినుంచి సహాయక చర్యలు కొనసాగించగా.. రెండో మృతదేహం ఆనవాళ్లు గుర్తించారు. మరో ఆరుగురి మృతదేహాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది.