BJP: బీజేపీలోకి 5మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బాంబు పేల్చిన తెలంగాణ బీజేపీ చీఫ్.. 5మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి.. త్వరలోనే ఎమ్మెల్యేలు ఎవరో చెప్తామని వెల్లడి.. సంచలనంగా రాంచందర్రావు వ్యాఖ్యలు;
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారని వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఆ ఎమ్మెల్యేలు.. మా పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ వైపు వారు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలే కాదని.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ఆగస్ట్ 10వ తేదీన బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరనున్నారని తెలిపారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. అయితే ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయన అసహనానికి పరాకాష్టగా తెలంగాణ బీజేపీ చీఫ్ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
విలీనం వార్తల వేళ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాదు.. అందుకు సంబంధించిన ఓ ఆడియో సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరిగ్గా అలాంటి వేళ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిద్దరు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. ఒకవేళ ఉంటే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చకుండా కేంద్రానికి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపించాల్సి ఉండే అని కామెంట్ చేశారు. రిజర్వేషన్లపై అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అవసరమే లేదన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కంటే కేంద్ర మంత్రులే ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాలనే ఎక్కువగా కలిశారని తెలిపారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలతో వేడెక్కాయి.