మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలుడి కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు.. మూడు రోజులైనా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక కృష్ణా కాలనీలో నివాసముంటున్న రంజిత్, వసంతల కుమారుడు దీక్షిత్రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశాడు. ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. రూ.45 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు ఫోన్ చేసిన కిడ్నాపర్.. బుధవారం మరోసారి ఫోన్ చేసి.. డబ్బులు రెడీ చేసుకోవాలంటూ బెదిరించాడు. ఒకవేళ తాను చెప్పిన అమౌంట్ సిద్ధం అయితే వీడియో కాల్లో చూపించాలన్నాడు. అప్పుడు తాను నమ్ముతానని, ఆ తర్వాత ఎక్కడికి తేవాలో చెప్తానని అన్నాడు. బాబు ఆరోగ్యం బాగానే ఉందని కంగారు పడకుండా ముందు డబ్బు సిద్ధం చేసుకోవాలని సూచించాడు.
ఈ కిడ్నాప్ను సవాల్గా తీసుకున్న పోలీసులు.. 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వంద మందితో గాలిస్తున్నారు. అటు సైబర్ సిబ్బంది సాయం కూడా తీసుకుంటున్నారు. ఐనా ఇప్పటివరకూ ట్రేస్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.