KTR: రాజకీయాల నుంచే తప్పుకోవాలనుకున్నా: కేటీఆర్
త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్న కేటీఆర్... రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు;
18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అన్నారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని... రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు.
2025 తరువాత ప్రజల్లోకి కేసీఆర్?
ప్రస్తుత రాజకీయాలు ఏ మాత్రం బాగాలేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా నెటిజన్లతో చిట్చాట్ నిర్వహించిన కేటీఆర్.. పలు అసక్తికర సమాధానాలు ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. 2025 తరువాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగాప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డే టార్గెట్
తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ సైలెంటుగా ఉన్నారు గానీ.. బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీశ్ రావు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నారు. ఐతే.. ఈ టార్గెట్ రాజకీయంగా చెయ్యడంలో తప్పులేదు గానీ.. వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, చిట్టి నాయుడు అంటూ కేరక్టర్ ఎసాసినేషన్ చెయ్యడం, బూతులు తిట్టడం వంటివి అభ్యంతరకరం అవుతున్నాయి. ప్రముఖ నేతలే ఇలా తమ స్థాయిని తగ్గించేసుకుంటూ.. నోటికొచ్చిన తిట్టల్లా తిట్టేస్తూ ఉంటే.. ప్రజల్లో వారి పట్ల చులకన భావం ఏర్పడదా అనే వాదన తెరపైకి వస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తి వాట్సాప్లో కోరాడు. అలా కోరినందుకు మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య ఆ వ్యక్తిని బెల్టుతో కొట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్కి ఫోన్ చేసి, ఏం జరిగిందో తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయపరంగా పోరాటం చేయటంతో పాటూ, బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని…పార్టీ మొత్తం భాస్కర్కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.