బీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు చల్లారడం లేదు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తమ నాయకుడికే టికెట్లు ఇవ్వాలంటూ అధిష్ఠానానికి అల్టిమేటం ఇస్తున్నారు. వికారాబాద్లో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. మెతుకు ఆనంద్ను మార్చాలని డిమాండ్ చేశారు. అభ్యర్థిని మార్చకపోతే ఓడిస్తామని హెచ్చరించారు. ఇంతకాలం ఆనంద్కు టికెట్ ఇవ్వొద్దన్న ఎంపీ రంజిత్రెడ్డినే.. మళ్లీ టికెట్ ఇప్పించారని అసమ్మతి వర్గం నేతలు ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా అభ్యర్థి మార్పు విషయాన్ని అధిష్ఠానం ఆలోచించాలని కోరారు. లేకపోతే ఆనంద్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ నాయకుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆయన అనుచరులు రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్నారు. హత్నురలో బీఆర్ఎస్ కార్యకర్త వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే నర్సాపూర్ అభ్యర్థిగా మదన్రెడ్డి పేరును ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జనగామ టికెట్ స్థానిక బీసీ నాయకుడికి కేటాయించాలని బీఆర్ఎస్ నేత మండల శ్రీరాములు డిమాండ్ చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపు కట్టారు. కేసీఆర్ చిత్రపటానికి తన చేతి వేలిని కోసుకొని రక్త తిలకం దిద్దారు. స్థానిక పరిస్థితులపై అవగాహన లేని వ్యక్తులు జనగామ టికెట్ కోసం పోటీపడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తులు కూడా ఎందుకో టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.