CM Kcr: ఆసిఫాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
అన్ని రంగాల్లో నేడు తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని వెల్లడించారు;
ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్లను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ను ప్రారంభించి పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్కు.. సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ ఓపెన్ చేశారు. అంతకుముందు పోలీస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి చేరుకోగానే జిల్లా పోలీసులు సీఎంకు గౌరవ వందనం సమర్పించారు. ఎస్పీని తన కుర్చీలో కూర్చోబెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కొమురంభీం చౌరస్తాలో కొమురంభీం విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
తెలంగాణలో పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆసిఫాబాద్లో పోడు భూములకు పట్టాల పంపిణీ ప్రారంభించిన ఆయన.. పోడు రైతులకు వరాలు కురిపించారు. పోడు రైతులకు రైతుబంధు ఇస్తామన్నారు. రెండు, మూడ్రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తవుతుందని చెప్పారు. అన్ని జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నామని.. విద్యుత్ ఉద్యోగుల కష్టంతోనే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రశంసించారు. ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోందన్న కేసీఆర్.. మన్యంలో మంచం పట్టే పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు. అన్ని రంగాల్లో నేడు తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని వెల్లడించారు.