రేపు ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రహోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం;
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్భవన్లో హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చిస్తారు. దిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ ... రాష్ట్రం తరఫున కేంద్రం వద్ద పెట్టాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. మావోయిస్టు 17వ ఆవిర్భావ వారోత్సవాలు వచ్చే మంగళవారం నుంచి జరుగుతున్నాయి.
వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, పార్టీ అధికార ప్రతినిధి జగన్తో పాటు బీకేటీజీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖలు విడుదల చేశారు. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ సీఎంలతో సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ నెల 1న కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం దిల్లీకి వెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు బస చేశారు. 2వ తేదీన దిల్లీలో టిఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం 3వ తేదీన ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు. ఒకే నెలలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో రెండవ సారిపర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.