CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి
ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన;
పార్లమెంట్ ఎన్నికల పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. కాసేపటి క్రితమే పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్రెడ్డి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRDలో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల , మల్కాజిగిరి, మహాబూబ్నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నేడు ఉమ్మడి ఐదు జిల్లాలకు చెందిన కీలక నేతలతో చర్చిస్తున్నారు. మంగళవారం( రేపు) మిగతా ఐదు జిల్లాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. MCRHRDలో ఐదు జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం అయ్యారు సీఎం రేవంత్.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉండనుంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు.
ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులకు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు.
పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు.