REVANTH: కిషన్ రెడ్డి కోసం పనిచేస్తున్న కేసీఆర్ : రేవంత్
రేవంత్ విమర్శలను తిప్పికొట్టిన కిషన్రెడ్డి, కేటీఆర్;
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కోసం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ పార్ట్నర్లని, బీజేపీ కోసం BRS పని చేస్తుందని చెప్పారు. ఇక కేసీఆర్ హయాంలో అసలు మెట్రో విస్తరణే జరగలేదన్నారు. తమ హయాంలో మెట్రో విస్తరణ జరగకూడదని కిషర్ రెడ్డి ఆలోచిస్తున్నారని, తనకు మంచి పేరు వస్తుందని విస్తరణను అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన పని లేదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లను బీజేపీ కాపాడుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ కేసులో సమగ్రంగా విచారణ జరపాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే విచారణ ముందుకెళ్తుందని తెలిపారు. చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. తనను విమర్శించే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. తనపై, బండి సంజయ్పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డిలా తాను పార్టీలు మారలేదన్నారు. పూటకో మాట మాట్లాడలేదు.. సిద్ధాంతం కోసం కట్టుబడి ఒకే పార్టీలో ఉన్నానన్నారు.
సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్
SLBC ప్రమాదం BRS వల్లే జరిగిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు KTR కౌంటర్ ఇచ్చారు. ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నాదట. అలా ఉంది రేవంత్ వ్యవహారం. ఒక బాధ్యత గల సీఎంవి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్ఠి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్లంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? . SLBC ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించండి. ’ అని ట్వీట్ చేశారు.