REVANTH: తెలుగు రాష్ట్రాలు కలిసి పోటీ పడాలి
చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపు;
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని.. ఆ దిశగా ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణతో పోటీ పడే కన్నా.... రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి పథం వైపు నడిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా రాణిస్తాయని అన్నారు. హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరై... నార్నే విజయలక్ష్మి సంపాదకత్వంలో వెలువడిన ‘‘తెలుగుదనం- తెలుగు ధనం’’పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తినప్పుడు కూడా చర్చల ద్వారా పరిష్కారమైన సందర్భాలున్నాయని, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోడానికి ఆ విధంగా ఆలోచన చేయలేమా... అని రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోటీ అని చాలామంది అంటుంటారని, కానీ.. ఏపీ, ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలున్నా.. చర్చించుకుని పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
ప్రముఖులకు సత్కారం
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవంలో ప్రముఖ సినీనటులు జయప్రద, జయసుధ, మురళీమోహన్, సాయికుమార్, నిర్మాత అశ్వినీదత్లను రేవంత్ రెడ్డి సత్కరించారు. నందమూరి తారకరామారావు చేతులమీదుగా 30 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సంస్థ 12వ ద్వైవార్షికోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి జనాభా 18కోట్ల మంది పైచిలుకు అని ఒక అంచనా ఉందన్న రేవంత్.. అయినా జాతీయ రాజకీయాలపై తెలుగువాళ్లం ప్రభావం చూపలేకపోతున్నామని అన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహారావు, ఎన్టీ రామారావు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని, ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్రెడ్డి, వెంకయ్యనాయుడు ప్రభావం చూపించారని గుర్తు చేశారు. రెండు, మూడు తరాలకు మధ్య.. చంద్రబాబు, వైఎస్ఆర్ ప్రభావం చూపించినా.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందన్నారు. అయితే ఐటీ, ఫార్మా రంగాల్లో తెలుగువారు ఎందరో అత్యున్నత స్థాయిల్లో రాణిస్తున్నారని తెలిపారు.
హాలీవుడ్తో తెలుగు సినిమా పోటీ
తెలుగు సినిమా రంగం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, హాలీవుడ్తో సైతం పోటీపడుతున్న సందర్భాలు చూస్తున్నామని సీఎం రేవంత్ ప్రశంసించారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక, సినీరంగాలలో రాణించడానికి ఏ భాషనైనా నేర్చుకోండని... కానీ, తోటి తెలుగువారితో మన మాతృభాషలోనే మాట్లాడండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విదేశాల్లోని తెలుగు వారంతా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాబోయే 25 ఏళ్లకు తగిన ఒక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని.. దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగువారంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు.