CONGRESS: మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
బర్దిపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన... ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం... కేసీఆర్, కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోంది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రాజకీయ వాతావరణం తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలతో దూకుడు పెంచుతున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం, అభివృద్ధి హామీలతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పోరాటం నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు… సీఎం ప్రసంగం మొత్తం ఎన్నికల నినాదంగా మారింది.
రేవంత్ తీవ్ర విమర్శలు
నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్లో పర్యటించిన సీఎం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… నిజామాబాద్లోని వ్యవసాయం తెలంగాణకే కాదు, దేశానికే దిశానిర్దేశం చేస్తోందని కొనియాడారు. నిజామాబాద్ రైతులు తమ హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని, ఆ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ 2028లో కూడా పోరాడి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనపు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనలతో ఈ జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. “మన వాళ్లు కార్పొరేటర్లుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికే ఓటు వేయాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికే ఆదర్శం అని కొనియాడారు. నిజామాబాద్ రైతుల పోరాట స్ఫూర్తితో 2028లో ఫైట్ చేస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనపు నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు.
బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికి కూపంగా మారిందని సీఎం తీవ్రంగా విమర్శించారు. మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ చెప్పిందని గుర్తు చేసిన సీఎం, ఆ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని బీజేపీని నిలదీశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి… కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారని ఆరోపిస్తూ, “కిషన్రెడ్డి… కల్వకుంట్ల కిషన్రావుగా మారారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపై ఫైర్
నిజామాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన ధర్మపురి అర్వింద్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సీఎం సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఎందుకు ప్రకటించలేకపోయిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మూడు సార్లు ప్రధానమంత్రి అయినా, ఈ ప్రాంతానికి ఏం ఒరిగిందని నిలదీశారు. నిజామాబాద్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పటికీ, ఎంపీ అర్వింద్ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అర్వింద్తో పాటు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలందరికీ కేంద్ర నాయకత్వం వద్ద బలంగా మాట్లాడే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులను జైలులో పెట్టాలని అర్వింద్ పదే పదే డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేసిన సీఎం, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆరు నెలలు దాటినా ఒక్క అరెస్టు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. “48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పిన కిషన్రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే అది వృథా అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. “గాడిదకు గడ్డి వేసి… ఆవుకు పాలు పిండితే ఎలా వస్తాయి?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, మన బస్తీ, మన కాలనీ అభివృద్ధి కావాలంటే మనోడే గెలవాలని చెప్పారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తేనే పట్టణాల రూపురేఖలు మారుతాయని తెలిపారు.