Peddapalli: నత్తనడకన కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు
రైల్వేగేటు తెరిచి ఉంచే సమయం కంటే మూసి ఉంచే సమయమే ఎక్కువ;
పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిత్యం వందల రైళ్ల రాకపోకలతోఇక్కడ రైల్వేగేటు తెరిచి ఉంచే సమయం కంటే మూసి ఉంచే సమయమే అధికంగా ఉంటోంది. రెండేళ్ల క్రితం 119 కోట్లు మంజూరైనా ఇంకా పనులు పూర్తికకాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కూనారంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఉంది. అందుకనుగుణంగా ఆరేళ్ల కిందట ఈ ROB నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. అయితే రాష్ట్రప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్రజాప్యం జరిగింది. ఎట్టకేలకు గతేడాది 119 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ ROB పనులు మొదలయ్యాయి. కొన్నాళ్లు వేగంగా సాగిన పనులు ఆ తర్వాత నత్తతో పోటీ పడుతున్నాయి. పెద్దపల్లి వైపు నాలుగు నెలల వ్యవధిలోనే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసిన గుత్తేదారు... కూనారం వైపు మాత్రం పనులు నెమ్మదిగా చేపడుతున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట, వరంగల్ ప్రాంతాలకు వెళ్లేవారికి దూరభారం తగ్గుతుంది. మంథనికి ముత్తారం మీదుగా అదనపు రహదారి అందుబాటులోకి వస్తుంది.
కాజీపేట, బల్లార్షతో పాటు దిల్లీ మార్గంలో నిత్యం వందల రైళ్లు ఇక్కడినుంచి పయనిస్తుంటాయి. దీంతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రైల్వేగేటు మూయాల్సి వస్తోంది. గేటు మూసిన ప్రతిసారీ కనీసం 20 నిమిషాల వరకు తిరిగి తెరిచే పరిస్థితి ఉండదు. ఈ మార్గంలో మూడో లైను పూర్తి కావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ వేగం పెరగడంతో పాటు, రైళ్ల సంఖ్యను కూడా పెంచారు. ఈ క్రమంలోనే లెవెల్ క్రాసింగ్ నిర్వహణ నుంచి తప్పుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో ఆర్వోబీ లేదా R.U.Bలను నిర్మించేందుకు ప్రతిపాదిస్తోంది. ఇదే సమయంలో పనుల జాప్యంతో గేటు దాటి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్అండ్బీ పరిధిలో పిల్లర్ల నిర్మాణం పూర్తయినా రైల్వే లైన్పై స్లాబ్ పనులు ఆలస్యమవుతున్నాయి. పెద్దపల్లిలో మాత్రం ఇంకా పిల్లర్ల పనులే జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిధిలో 6 ఆర్వోబీలు, 3 అండర్ పాసులకు కేంద్రం అనుమతినిచ్చింది. పట్టణంలోని కూనారం ఆర్వోబీతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరెడ్డిపేట మార్గంలో మరో ఆర్వోబీకి నిధులు విడుదల చేసింది. అయితే నిధులు విడుదలైనా పనుల్లో మాత్రం తాత్సారం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ROB నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని పెద్దపల్లి వాసులు కోరుతున్నారు.