Editorial: "తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర నాయకత్వం సీక్రెట్ ఆపరేషన్.."
తెలంగాణ బీజేపీలో కొత్త టెన్షన్; నేతల పనితీరుపై అధిష్టానం సీక్రెట్ ఆపరేషన్; ఎప్పటికప్పుడు ఢిల్లీ చేరుతున్న రిపోర్టులు; కార్నర్ మీటింగులను లైట్ తీసుకోవడమే కారణం; రిపోర్టులపై చర్యలుంటాయా, భయపెట్టడానికేనా?;
తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్ తో కార్యాచరణ అమలు చేస్తోందట బీజేపీ. రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్యక్రమాలు రూపొందిస్తోందట. జాతీయ నాయకత్వం ఆదేశాలతో పార్టీ యాక్టివిటీస్ లో ఒక్కసారిగా స్పీడ్ పెంచిందట రాష్ట్ర నాయకత్వం. అయితే మేమిచ్చిన యాక్టివిటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా లేదా అన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తోందట బీజేపీ జాతీయ నాయకత్వం. ఉత్తర భారతంలో ఇలాంటి ప్లాన్లనే అమలు చేసి సక్సెస్ అయిన బీజేపీ.. దక్షిణాదిన కూడా అదే ఫార్ములా ఉపయోగించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని నిర్ణయించిందట.
ఇందులో భాగంగానే ప్రజా గోస, బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు చేసిందట. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉందట. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ నాయకత్వం 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహించాలని టార్గెట్ పెట్టిందట. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు మండల స్థాయి నేతల వరకు పాల్గొనాలని ఆదేశించిందట. ఈ సమావేశాల్లో పొల్గొనే నేతలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించింది రాష్ట్ర నాయకత్వం. తీరా పది రోజులుగా సమావేశాలు జరుగుతున్నా కొంతమంది నేతలు బయటకు రావడంలేదట. తమకు ఇచ్చిన కార్యాచరణ అమలు చేయడంలో సుముఖంగా లేరట. కనీసం పార్టీ కార్యాలయం నుండి వస్తున్న కాల్స్ ను కూడా అటెండ్ చేయలేదట. దీంతో ఇచ్చిన కార్యాక్రమాలను లైట్ తీసుకుంటున్న నేతలపై గుర్రుగా ఉందట జాతీయ నాయకత్వం .
బీజేపీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్నర్ మీటింగ్లపై ఓ నజర్ వేయాలని నిర్ణయించిందట. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమావేశాల్లో పాల్గొంటున్న నేతలెవరు.. వారి సమావేశాలకు ప్రజల నుండి వస్తున్న స్పందన ఏంటీ అన్న వివరాలను సేకరిస్తోందట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందట బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ వ్యవస్థ ద్వారా సీక్రెట్ గా నేతల రిపోర్టులను సేకరిస్తున్నారట. సమావేశాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన 700 మందికి పైగా నేతలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. వారి పనితీరు ఎలా ఉంది అన్న దానిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారట. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో వారికి ఎలాంటి పనులు అప్పజెప్పాలి. పనిచేయని వారిని ఎలా దారికి తెచ్చుకోవాలన్న దానిపైనా కసరత్తులు చేస్తున్నారట.
డైరెక్ట్ గా జాతీయ నాయకత్వమే రిపోర్టులు సేకరిస్తుండటంతో నేతల్లో కొత్త కలవరం మొదలైందట. అప్రమత్తం అవుతున్న కొందరు నేతలు తమపై ఎలాంటి రిమార్క్ రాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ రిపోర్టులను సునీల్ బన్సాల్ ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన సూచనలు చేస్తుండటంతో తమపై ఎలాంటి రిపోర్టు రెడీ అవుతుంది. మైనస్లు ఏమైనా ఉన్నాయా.. పాజిటీవ్ రిపోర్టే వెళ్తుందా అన్న దానిపై ఆరాతీస్తున్నారట. వంద రెండు వందల మంది ఉండే కార్నర్ మీటింగ్స్ కు తామేం వెళ్తామనుకుని ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్న నేతలూ అలర్ట్ అవుతున్నారట.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమపై జాతీయ నాయకత్వంకు బ్యాడ్ ఇప్రెషన్ వెళ్తే అసలుకే మోసం వస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు .. ఇప్పటికే అప్రమత్తం అయ్యారట. ఢిల్లీ స్థాయి నుండి వస్తున్న సమాచారంతో తమ పనితీరు మెరుగుపరుచుకునే పనిలో పడ్డారట. తమపై నెగిటివ్ రిమార్క్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై కూడా కసరత్తు చేస్తున్నారట. కార్నర్ మీటింగ్ ల ముగింపు కు మరో 4 రోజుల సమయమే ఉండటంతో వీలైనన్ని ఎక్కువ సమావేశాల్లో పాల్గొని .. పాజిటివ్ మార్కులు తెచ్చుకునే పనిలో పడ్డారట. మరి రాష్ట్ర నేతలపై వచ్చిన రిపోర్టులపై కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందా.. కేవలం భయపెట్టడానికే దీనిని పరిమితం చేస్తుందా వేచి చూడాలి.