ECI : కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై మండిపాటు;
కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని ఈసీ పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈసీ వెల్లడించింది. ప్రకటన కోసం కర్ణాటక ప్రభుత్వం కనీసం దరఖాస్తు చేయలేదని తెలిపింది.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇంగ్లీష్, స్థానిక మీడియా సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్టీ నేతలు సుధాన్షు త్రివేది, ఓం పాఠక్లతో కూడిన బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం, ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం గత కొన్ని రోజులుగా తెలంగాణకు చెందిన ఇంగ్లీష్, ప్రాంతీయ మాధ్యమాల్లో ప్రకటనలు ప్రచురిస్తోందన్నారు.
ఈ అంశంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సంబంధిత ప్రభుత్వంలోని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు కేంద్రమంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావం చేసేందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తోందని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఇలాంటి అంశాలపై స్పష్టమైన సందేశం ఇచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.