మంత్రి కేటీఆర్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు విజయశాంతి. ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకని ప్రశ్నించిన కేటీఆర్.. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన ఎంఐఎం ప్రముఖ నేత గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఆ ప్రముఖ నేత గతంలో తమవారిని 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని.. వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తాన్నాడు.
తన వర్గం వారంతా కలసి ఉమ్మువేస్తే చాలు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడు. హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడు. హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు అని.. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేటీఆర్ ఎందుకు నిలదీయలేదని విజయశాంతి ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోందన్నారు.