RAIN: తెలంగాణలో కుమ్మేసిన వడగళ్ల వర్షం
తడిసిన ధాన్యంతో భారీగా పంట నష్టం.... రద్దైన రాజకీయ పార్టీల సభలు;
తెలంగాణలో దాదాపు రెండు వారాలుగా ఎండలు ఠారెత్తించగా సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వర్షం కుమ్మేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. భానుడి భగభగలతో అతలాకుతలమవుతున్న తరుణంలో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వడగండ్లు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి. మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కరీంనగర్ SRR కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో CM సభ రద్దు చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. హుస్నాబాద్, వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్తో పాటు హుజురాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొట్టుకుపోయింది.
వరంగల్ తిమ్మాపూర్లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా... ఈదురు గాలులకు సభావేదిక కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండటంతో కొంతమేరకు ధాన్యం కొట్టుకుపోయింది. రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయారు.