GADWAL: రగిలిన ధన్వాడ... కంటైనర్, టెంట్లకు నిప్పు

పెద్ద ధన్వాడ వద్ద ఉద్రిక్తత.. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కంపెనీ యత్నం;

Update: 2025-06-05 03:30 GMT

జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. తొమ్మిది నెలలుగా సమీప 10 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన.. చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కంపెనీ వారు ఏర్పాటు చేసుకున్న గుడారాలు, సామగ్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. గ్రామ శివారులో గాయత్రి కంపెనీ వారు ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టేందుకు 2024 అక్టోబరులో గుడారాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 11 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ హామీ మేరకు విరమించారు. ఆర్డీవో వద్ద జరిగిన చర్చల్లోనూ పరిశ్రమను వ్యతిరేకించారు.

పనుల పున:ప్రారంభానికి రావడంతో

బుధవారం తిరిగి పనులు ప్రారంభించేందుకు సామగ్రితో సహా కూలీలు వచ్చారు. దీంతో గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. కంపెనీకి చెందిన వ్యక్తులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పనులు చేయబోమని చెప్పి, ఎలా చేస్తారంటూ ఆయా గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు.. ఇలా సుమారు వెయ్యి మందికి పైగా పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొందరు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. మరియమ్మ అనే మహిళ తలకు గాయమైంది. ఆగ్రహించిన ప్రజలు పరిశ్రమ ఏర్పాటు ప్రాంతానికి పరుగులు పెట్టి, సామగ్రి ధ్వంసం చేశారు. వారు వేసుకున్న రెండు గుడారాలు కూల్చేశారు. తరువాత కంటెయినర్‌తో సహా  గుడారాలకు నిప్పుపెట్టారు. రెండు జేసీబీ, రెండు కార్లు, టిప్పర్‌ అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమారు. డీఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని డీఎస్పీ తెలిపారు.

పోలీసులు ఉన్నా

పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ, ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పీకివేశారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమికొట్టడంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాజమాన్యం కంటైనర్లతో పాటు జేసీబీలు, కార్మికులను పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకెళ్లింది. ఇవాళ10 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి పోరుబాట పట్టారు.

Tags:    

Similar News