తెలుగు రాష్ట్రాలను వదలని వానలు.. మరో 3 రోజులు ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు
Heavy Rain Alerts: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈనెల 23న బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక ఇవాళ తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని... రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి నిజామాబాద్లో కుండపోత కురుస్తోంది. దీంతో లోతట్టు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేపు, ఎల్లుండి కూడా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు హైదరాబాద్ చిత్తడిగా మారింది. రెండ్రోజులుగా కాలనీలన్నీ ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. నగర శివారులోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పల్, నాగోల్,ఎల్బీనగర్, సరూర్నగర్, మీర్పేట్, ఆసిఫ్నగర్ చెరువుల్ని తలపించాయి..
మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కమలానగర్ ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. సరూర్నగర్ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి.