Heavy Rains in Telangana : భారీ వర్షానికి తడిసి ముద్ధైన భాగ్యనగరం

Heavy Rains in Telangana: తెలంగాణను వరుణుడు వదలట్లేదు. ఒకటి రెండు రోజులు కాస్త శాంతించినట్లు కనిపించినా.. మరోసారి తన ప్రతాపం చూపించాడు.;

Update: 2022-10-13 07:28 GMT

Heavy Rains in Telangana: తెలంగాణను వరుణుడు వదలట్లేదు. ఒకటి రెండు రోజులు కాస్త శాంతించినట్లు కనిపించినా.. మరోసారి తన ప్రతాపం చూపించాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది.


ఉరుములు, మెరుపులతో కూడిన జడివాన నగర వాసులకు దడపుట్టించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. నివాసిత ప్రాంతాలు, అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు వర్షపునీటితో నిండిపోయాయి. ఏకధాటి వర్షంతో నగరంలోని వీధుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కూకట్‌పల్లి, బోరబండ, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నగరంలో జడివాన అల్లకల్లోసం సృష్టించింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. రసూల్‌పురాలో ఇళ్లలోకి నీరు చేరింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


రోడ్లపై మోకాళ్ల లోతు నీరుచేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా కూకట్ పల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలానగర్ లో 9 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 8.7 సెంటీమీటర్లు , మూసాపేట్ లో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో.. రాత్రంతా నగరవాసులు అవస్థలు పడ్డారు.

ఇక కుత్బుల్లాపూర్‌లో నిన్న కురిసిన వర్షానికి జీడిమెట్ల శ్రీనివాస్‌ నగర్‌ కాలనీ.. పద్మా నగర్‌ కొంపల్లిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి.

హైదరాబాద్‌ శివారులోని జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 9వందల క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసీలో విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్‌ సాగర్‌కు ఇన్‌ఫ్లో 12వందల క్యూసెక్కులుగా ఉంది. దీంతో రెండు గేట్లు ఎత్తి 13వందల క్యూసెక్కులను మూసీలోకి వదలనున్నారు. 


మరోవైపు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి విదర్బల మీదుగా ద్రోణి బలహీనపడగా.. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో ఈనెల 15వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఈరోజు కూడా భారీ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర వాసులకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News