అప్పుడు 15 రోజుల పాటు వాహనం పైనే ఖైరతాబాద్ గణేషుడు.. మరి ఇప్పుడేలా?
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే;
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడు పైనే ఉంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు.
ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేషుడుని హుస్సేన్సాగర్ లోనే నిమజ్జనం చేస్తున్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఇలా తీర్పు ఇవ్వడంతో అసలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గత 66 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం హుస్సేన్సాగర్లోనే జరుగుతుందని ఈ సారి కూడా హుస్సేన్సాగర్లోనే జరగాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
లేకపోతే మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి చర్చించారు. నిమజ్జనం హుస్సేన్సాగర్లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ భారీ వినాయకుడిని హుస్సేన్ సాగర్లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
ఇదిలాఉండగా 1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్బండ్పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మరి ఇప్పుడెం జరుగుతుందో చూడాలి మరి.