రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జన్వాడ ఫామ్హౌస్ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘కుట్రలతో మా గొంతు నొక్కుతున్నారు. మా కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..చిల్లర పనులు, కేసులకు భయపడం. అది ఫామ్హౌస్ మా బావమరిది రాజ్ పాకాల ఇల్లు. పార్టీలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అది ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రమే. గృహ ప్రవేశం సందర్భంగా జరిగిన ఫంక్షన్. పార్టీలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దావత్లో 13 మందికి నెగిటివ్ వస్తే ఒకరికే పాజిటివ్ వచ్చిందంట. ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నారో విచారించాలి. సోదాల పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకోం. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారింది. డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నాయి. నా బావమరిదికి డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. నేను వెనక్కి తగ్గేది లేదు.. కాంగ్రెస్ను నిలదీస్తూనే ఉంటాం. చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టండి’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.