KCR: ప్రభుత్వం ఆమోదంతోనే కాళేశ్వరం
50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ.. అన్నింటికీ సమాధానం ఇచ్చిన గులాబీ దళపతి;
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ చేపట్టిన విచారణ ముగిసింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం. అంతేగాక పలు డాక్యుమెంట్లు కూడా కమిషన్కు ఆయన సమర్పించారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ను ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది.
కేసీఆర్కు కమిషన్ 18 ప్రశ్నలు
విచారణలో భాగంగా కేసీఆర్కు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని పీసీ ఘోష్ కమిషన్ 18 ప్రశ్నలు సంధించింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణలో అవకతవకలను విచారిస్తోంది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రాజెక్ట్ రీడిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలు, ఆర్థిక నిర్ణయాలు, అనుమతులపై కమిషన్ 18 ప్రశ్నలు అడగగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నీటి లభ్యత ఆధారంగా చేపట్టినట్లు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్యల కారణంగా మేడిగడ్డకు స్థలం మార్చినట్లు వివరించారు. ఇది కేంద్ర జల సంఘం(CWC), మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల తీసుకున్న సాంకేతిక నిర్ణయమన్నారు. బ్యారేజీల స్థల ఎంపిక, అన్నారం, సుందిల్లా బ్యారేజీల డిజైన్ మార్పులు వంటివి ఇంజనీర్ల సలహాలు, WAPCOS సిఫార్సుల మేరకు జరిగాయని.. ఈ నిర్ణయాలన్నీ కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రాజెక్ట్ నిర్మాణానికి జల శక్తి మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం జూన్ 2018లోనే తీసుకున్నామని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్, దాని కీలక అంశాలను వివరిస్తూ కేసీఆర్ ఒక నివేదికను కమిషన్కు సమర్పించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన పుస్తకాన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కు అందజేశారు.
వన్ టు వన్ విచారణ
మొదట బహిరంగ విచారణ జరుగుతుందని భావించినా.. కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించి, 12గంటలకు వన్ టు వన్ విచారణ ప్రారంభించారు జస్టిస్ ఘోష్. యాభై నిమిషాల పాటు కేసీఆర్కు కీలక ప్రశ్నలు సంధించారు. 12.55కు బయటకు వచ్చిన కేసీఆర్.. కారులోంచే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే, కాళేశ్వరంపై కేసీఆర్ నుంచి జస్టిస్ ఘోష్ కమిషన్ కీలక సమాచారం తీసుకుంది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్పై కమిషన్కు కేసీఆర్ వివరించినట్టు సమాచారం.
కేబినెట్ ఆమోదంపైనా ప్రశ్నలు
ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నించగా.. కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కమిషన్కు తెలిపారు. కేసీఆర్తోపాటు లోపలికి 9 మందికి అనుమతించగా.. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు, విచారణ సందర్భంగా అధినేతతో ఉన్నారు.