KCR Letter To Modi: ధాన్యం కొనుగోలుపై మోదీకి లేఖ రాసిన కేసీఆర్.. మరి సమస్య తీరేనా..?
KCR Letter To Modi: ధాన్యం కొనుగోలుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.;
KCR Letter To Modi (tv5news.in)
KCR Letter To Modi: ధాన్యం కొనుగోలుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలివ్వాలని తన లేఖలో కోరారు. రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఖరీఫ్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. వచ్చే రబీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్సీఐ స్పష్టత ఇవ్వట్లేదని, ఏటా ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని లేఖలో పీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి పియూష్ గోయల్ను సెప్టెంబర్ 24, 26 తేదీల్లో కలిసి వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని విజ్జప్తి చేసినా.. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసే ధాన్యం కోటాను పది లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యతతో ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు.
ఎఫ్సీఐ అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిందని లేఖలో కేసీఆర్ వాపోయారు. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయితు, అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్సీఐ సేకరించిందని గుర్తుచేశారు. ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.