phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై పోలీసుల దృష్టి;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేయడంతో దానిపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు సిట్ ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను విచారిస్తూనే…. మరోవైపు బాధితుల వివరాలను కూడా సిట్ సేకరిస్తోంది. ఇందులో సినీ, రాజకీయ, మీడియా, వ్యాపారవేతలతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది.
నిందితులెందరు..?
600కుపైగా బాధితులతో కూడిన ఓ జాబితాను కూడా సిట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా నోటీసులు జారీ చేస్తూ విచారిస్తోంది. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. త్వరలోనే మరికొంతమంది రాజకీయ నాయకుల నుంచి వాంగ్మూలాలను సేకరించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావ్ తో కూడిన టీమ్ నిరంతరం పని చేసినట్లు సిట్ గుర్తించింది. దాదాపు 4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ వర్గాల మేరకు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. సిట్ విచారణతో పాటు బయటికి వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే…. ఈ కేసులో బాధితుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారితోనే నిందితుల సంఖ్య ఆగిపోతుందా…? లేక మరికొంత మంది పేర్లు తెరపైకి వస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.