Bayyaram Steel Plant : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు : టీఆర్ఎస్

Bayyaram Steel Plant : బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది;

Update: 2022-09-27 14:15 GMT

Bayyaram Steel Plant : బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్రమంత్రి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని దుయ్యబట్టారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని 8ఏళ్ల తర్వాత చెప్పడం చేతగాని తనమే అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం తప్పదంటున్నమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తరలిపోకుండా పోరాటం చేస్తామన్నారు. విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఒకటని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కిషన్‌ రెడ్డికి అవసరం లేదా అంటూ ప్రశ్నించారు.

గిరిజనుల ఆశలకు ఉరి వేసినట్లుగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఎంపీ మాలోతు కవిత. విభజన హామీలు అమలు చేయని కేంద్రమంత్రులు చేతకాని దద్దమ్మలు అంటూ ఫైరయ్యారు. తెలంగాణకు టూరిస్ట్‌ల లాగా వస్తున్నారు తప్ప.. పైసా ప్రయోజనం లేదన్నారు ఆమె. మాట నిలబెట్టుకోకపోతే బీజేపీ నేతలను తెలంగాణలో తిరగనివ్వమని ఎంపీ మాలోతు కవిత హెచ్చరించారు.

ఇటు హన్మకొండలోనూ టీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగింది. అంబేద్కర్‌ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నేతలు దగ్ధం చేశారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు ఆందోళన చేస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ హెచ్చరించారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం తప్పదని టీఆర్‌ఎస్‌ హెచ్చరిస్తోంది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కిషన్‌ రెడ్డి పట్టించుకోవడం లేదని గులాబీ నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News