ELECTIONS: ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
నేటి కేబినెట్ భేటీ తర్వాత తేదీలపై స్పష్టత... వెల్లడించిన మంత్రి పొంగులేటి;
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలక నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతుంది. జూలైలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు మంత్రుల త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్దం అవ్వాలని క్యాడర్కు సంకేతాలు పంపుతున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఇందుకు 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఏవైనా విభేదాల ఉంటే, వాటిని పక్కనపెట్టి పార్టీ విజయం కోసం కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు.
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు. తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని... తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నాయకుల మధ్య సరైన సమన్వయం ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్
ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గత క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే సమయం సరిపోయే అవకాశం లేకపోవడంతో ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్ సమాలోచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులై లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై క్యాబినెట్ చర్చించింది. ఇప్పటికే ఆలస్యం అయిందని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేడు జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.