LRS దరఖాస్తుదారులకు గుడ్న్యూస్ చెప్పిన కేటీఆర్
పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉంది కాబట్టే.. మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు
LRS దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అసెంబ్లీలో సభ్యుల విజ్ఙప్తి చేయడంతో 131 జీవోను సవరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉంది కాబట్టే.. మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో ఎప్పుడైతే వారు రిజిస్ర్టేషన్ చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి రూ.70 కోట్లు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మున్సిపాలిటీల్లో త్వరలోనే వార్డు ఆఫీసర్ల నియామకాలు చేపడతామని కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పని చేస్తారని వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 67వేల 35 కోట్లు కేటాయించామని అసెంబ్లీలో చెప్పారు. జీహెచ్ఎంసీకి ప్రతి నెలా రూ. 78 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండలిలో మంత్రి సమాధానమిచ్చారు.