CHAIRMEN: లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం!
తీవ్ర ఉత్కంఠ రేపిన చైర్మన్ ఎన్నిక
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగి చివరికి లక్కీ డ్రాతో ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థి కదకంచి బాలమణి అదృష్టం వరించింది. దీంతో జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. వీటిలో బీఆర్ఎస్ 13 వార్డులు గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి బీఆర్ఎస్ బలం 16కు చేరింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు గెలుచుకుని, మిత్రపక్షం సీపీఎం ఒక వార్డు సాధించింది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో పాటు భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటు కలిపి కాంగ్రెస్ బలం కూడా 16కు చేరింది. దీంతో ఇరు పార్టీల మధ్య సమాన పరిస్థితి నెలకొంది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బాలమణి, బీఆర్ఎస్ తరఫున గంజి రాజమణి పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపులో ఇద్దరికీ 16 చొప్పున రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఇద్దరి పేర్లు చీట్లలో వేసి డ్రా తీసగా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా ప్రకటించారు. ఫలితాన్ని ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కు చేరి ఇరు పార్టీల సంఖ్య సమానమైంది. దీంతో అక్కడ కూడా లాటరీ ద్వారా చైర్మన్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో లక్కీ డ్రా కాంగ్రెస్కు అనుకూలంగా మారింది.