Warangal Maoists : వరంగల్లో యాక్టివ్ అవుతున్న మావోయిస్టులు.. హెచ్చరిక లేఖ విడుదల..
Warangal Maoists : తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ మళ్లీ యాక్టివ్ అయిదా అంటే అవుననే సమాధానం వస్తోంది.;
Warangal Maoists : తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ మళ్లీ యాక్టివ్ అయిదా అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో మావోల ప్రభావం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నా మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బులకు, ప్రలోభాలకు ఆశపడి వ్యాపారస్తులు, లంపెన్స్ ఇన్ ఫార్మర్ గా మారొద్దంటూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు.జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ డివిజన్ల కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ గ్రామాలతోపాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే పథకంలో భాగంగా బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు ముఠా ఇన్ ఫార్మర్ నెట్ వర్క్ ను పెంచి పోషిస్తూ పన్నుతున్నారని.
కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ప్రమోషన్లకు, రివార్డులకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుల సెక్షన్ తో లాంపెన్ యువతతో, వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకొని సమాచారం మాకు డబ్బులు మీకు అని ప్రచారం చేస్తు వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా మార్చుకుంటున్నారని లేఖలో విమర్శించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వెంటన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు, ఇన్ఫార్మర్లు తమ పద్దతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్ట్ లు లేఖల ద్వారా హెచ్చరిస్తున్నారు.
వరస మావోయిస్ట్ లేఖలతో పచ్చని గ్రామాల్లో ఎప్పుడు ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు భూపాలపల్లి, ములుగు జిల్లాలోని కొంతమంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ల ఫోటోలను విడుదల చేసి సమాచారం మాకు.. బహుమతి మీకు అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మావోల టార్గెట్లో ఉన్న నేతలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే పోలీసుల నిఘాలు మావోల రిక్రూట్మెంట్, కార్యకలపాలను ఆపలేకపోతున్నాయి మావోల నూతన కమిటీలు,అడవిలో కవాతులు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.