REVANTH: పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేయండి

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి... ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వుత్తుల ర్యాలీ;

Update: 2025-04-26 02:30 GMT

పహల్గామ్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గామ్‌ మృతులకు సంతాపం తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో పీవోకేను ఆక్రమించాలని పాకిస్థాన్‌ను రెండుగా చేయాలని మోదీకి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

తీవ్రవాదాన్ని నిర్మూలించాలి

“పర్యాటకులపై దాడి చేయడం అనేది మానవత్వాన్ని నాశనం చేసే చర్య. ఇలాంటి దాడులను ఖండిస్తూ, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అందరం ఒక్కటిగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతుగా నిలవాలి" అని రేవంత్‌రెడ్డి అన్నారు. మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత్‌లోకి చొచ్చుకొచ్చి.. పాక్‌ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని వెంట ఉంటారు. ఈ విషయంలో మోదీకి మద్దతు తెలుపుతున్నా. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.

పీవోకేను భారత్‌లో కలపండి

“1971లో పాకిస్థాన్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్‌పేయీ పోల్చారు. మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలి. పీవోకేను భారత్‌లో కలపాలి. ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకొని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలి.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపాలని డిమాండ్ చేశారు. పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీకి భారీగా జనం తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తూ తీవ్రవాదాన్ని అంతం చేయాలన్నారు. అంతా ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News