జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చేర్చించారు. సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో... ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. తెల్లవారుజామున 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం
* మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించారు. * ఓయూలో బీఏ చదివారు. * 1983లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. * తెలుగు యువత అధ్యక్షుడిగా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్, నగర టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. * 2014లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం (అప్పటి TRSలో చేరారు) * 2018, 2023లో BRS అభ్యర్థిగా గెలుపొందారు.