KAVITHA: పదేళ్లు క్షోభ అనుభవించా
కేటీఆర్ టార్గెట్గా మళ్లీ విమర్శలు చేసిన కవిత... కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టీకరణ;
బీజేపీతో కలిస్తే దీర్ఘకాలిక భవిష్యత్తు ఉండబోదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీజేపీతో జతకట్టే పార్టీలు మరుగున పడటం ఖాయమని సంచలన ఆరోపణలు చేశారు. తాను కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత... కొత్త పార్టీ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం తప్ప మరేదీ తనకు అంగీకారం లేదని, పార్టీని కాపాడుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు వ్యతిరేకిస్తూ, కేసీఆర్ కుటుంబం కంటే ప్రజలంటేనే ఎక్కువ అభిమానం ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్కు చెప్పానన్నారు. పార్టీలో పదేళ్లుగా ఎన్నో ఆవేదనలను అనుభవించానని చెప్పారు. శుక్రవారం మంచిర్యాలకు వచ్చిన ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తెలంగాణను సాధించిన పార్టీని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలనేది తన తాపత్రయం తప్పితే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘ఏవైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని.. గీతదాటొద్దని కొంతమంది అంటున్నారు. మరి నేను రాసిన లేఖ అంతర్గతమే కదా.. దాన్ని బయటపెట్టింది ఎవరు?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ భోజనం చేసే సమయంలోనూ ప్రజాసమస్యలపైనే చర్చిస్తారు తప్ప కుటుంబానికి, వ్యక్తిగత అంశాలకు తావీయరని.. అందుకే లేఖలు రాస్తానని కవిత చెప్పారు.
కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవేనని స్పష్టం చేశారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పారని, అయితే విలీనాన్ని తాను ఒప్పుకోనని అప్పుడే చెప్పానన్నారు. కేసీఆర్కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అని చెప్పారు. లెటర్ రాయడంలో తన తప్పేం లేదన్నారు. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. 20 ఏళ్ల ముందే పసిగట్టగలను. ఎంపీగా ఉన్నప్పుడే బీసీల రిజర్వేషన్లు, మహిళా బిల్లు అంశాలను పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చా. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడేమైంది.. నేను ఆలోచించినట్లుగానే జరుగుతోంది కదా.. ఒకవేళ నేను చెప్పినట్లుగా ఆనాడే రాజకీయ విధానాన్ని ప్రకటించి ఉంటే ఆ పేరు బీఆర్ఎస్కు వచ్చేది. సింగరేణిలో, పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని చెప్పినా పట్టించుకోలేదు. చెప్పి లాభం లేదనుకొని తెలంగాణ జాగృతిలో కొత్తతరానికి అవకాశం కల్పించాం. పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ముందుకు వెళ్తున్నా.. నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని అనుకోవడం లేదు. లిక్కర్ స్కాంలో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. నేను నిర్దోషిని. నా లేఖతో కాంగ్రెస్, భాజపాలకు రాజకీయంగా ఎలాంటి మేలు జరగదు’’ అని కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన
మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనపై బీఆర్ఎస్ అధిష్టానం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. పార్టీకి సంబంధించి నేతలు ఎవరెవరు వెళ్తున్నారనే దానిపై ఆరా తీసింది. సొంత మీడియా ప్రతినిధులతో పర్యటన మొత్తాన్ని చిత్రీకరించాలని ఆదేశించింది. న్యూస్ అవసరం లేదని.. కవిత వెంట ఎవరెవరు ఉన్నారో వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి సంబంధించి నాయకులు ఎవరూ కూడా కవిత పర్యటనకు హాజరుకాకుండా ఆమెకు పెద్ద షాకిచ్చారు. కవిత టీజీబీకే అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో ఆమె వెంట తిరిగిన వందలాది మంది కార్మిక నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా కవిత పర్యటనవైపు కన్నెత్తి చూడని పరిస్థితి. మర్యాదపూర్వంగానూ నేతలు మొహం చూపలేదు. కేవలం దాసరి ఉష మాత్రమే కాసేపు వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో ఎమ్మెల్సీ పర్యటించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెళితే ఆమె వెంట ఎవరూ వెళ్లరన్న సంకేతం వెలువడినట్లైంది.