TS Prajavani:ప్రజాభవన్లో ప్రజావాణికి భారీ స్పందన.
పంజాగుట్ట వరకు క్యూలైన్లు;
ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి భారీస్పందన లభిస్తోంది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ కి వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందించారు. వృద్ధులు, యువకులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో...ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామైంది. అర్జీదారులకు ఇబ్బంది రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజావాణి ప్రారంభంలో రోజూ దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం...ఆ తర్వాత మంగళవారం, శుక్రవారం మాత్రమే ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
శుక్రవారం ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరారు. శుక్రవారం ఉదయం నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ తరలి వచ్చారు. దీంతో బేగం పేట నుంచి పంజాగుట్ట సిగ్నల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. ఉదయం ఆరు గంటలకే పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడ్డారు. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సిఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రజావాణిగా మార్చారు. ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలతో బేగంపేట రద్దీగా మారింది. మరోవైపు సిఎం క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సిఎం అధికారిక నివాసంగా మార్చిన నేపథ్యంలో ప్రజావాణిలో ఆయన ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బేగంపేట నుంచి భట్టి విక్రమార్క
డిప్యూటీ సిఎం కొంత సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత అధికారులు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను శాఖల వారీగా వాటిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.