టెంపుల్ పాలిటిక్స్కు మరోసారి తెరలేపిన బండి సంజయ్!
రాష్ట్ర రాజకీయాలను సంజయ్ తన రూట్లోకి తీసుకు వస్తున్నారా? తాను టార్గెట్ చేస్తే అధికార పార్టీకి దెబ్బపడాల్సిందేనా? అధ్యక్ష పదవి దక్కినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్..;
రాష్ట్ర రాజకీయాలను సంజయ్ తన రూట్లోకి తీసుకు వస్తున్నారా? తాను టార్గెట్ చేస్తే అధికార పార్టీకి దెబ్బపడాల్సిందేనా? అధ్యక్ష పదవి దక్కినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్.. ఎన్నికల్లో మరింత స్పీడ్ పెంచుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని రొటీన్కు భిన్నంగా తీసుకెళ్తున్నారు.
తెలంగాణలో ఎలా జెండా పాతాలో బండి సంజయ్కి అర్థం అయినట్టుంది. టీఆర్ఎస్ అంటే ఇన్నాళ్లూ ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగానే గుర్తుపెట్టుకున్నారు జనం. రాష్ట్రాన్ని సాధించినందుకు సారు కారును గెలిపిస్తూ వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కూడా తెలంగాణ సాధన కోసం పోరాడినప్పటికీ.. జనం టీఆర్ఎస్నే ఓన్ చేసుకున్నారు. అందుకే, స్ట్రాటజీ మార్చుతోంది బీజేపీ. ముఖ్యంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కొత్త దారిలో నడుస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడం లేదు, ఆంధ్రోళ్లను టచ్ చేయడం లేదు. కేవలం టీఆర్ఎస్ను, నేతల అవినీతిని, ప్రభుత్వ అసమర్ధతనే టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఏం చేసైనా సరే.. తెలంగాణ ప్రజల దృష్టిలో పడాలన్నదే బండి సంజయ్ టార్గెట్. అందుకే, హిందూత్వ అజెండాను అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడి రగిల్చిందే భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి. వరద సాయాన్ని ఆపించేసింది బీజేపీ వాళ్లు అంటూ కేసీఆర్ కామెంట్ చేయడంతో.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ సవాల్ విసిరారు. అక్కడ నుంచి మొదలైన టెంపుల్ పాలిటిక్స్ను కొనసాగిస్తూనే ఉన్నారు బండి సంజయ్. ఏకంగా అమిత్షాను భాగ్యలక్ష్మి టెంపుల్కు తీసుకెళ్లారు. కార్పొరేటర్లను సైతం భాగ్యలక్ష్మి టెంపుల్కే తీసుకెళ్లి ప్రమాణం చేయించారు. ఇప్పుడు భద్రకాళి టెంపుల్తో కొత్త ప్లాన్ షురూ చేస్తున్నారు.
త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో వరంగల్ అభివృద్ధిపైనా, అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపైనా ప్రమాణం చేద్దాంరండంటూ సవాల్ విసిరారు. తన సవాల్తో అటెన్షన్ను వరంగల్వైపు తిప్పుతున్నారు. ఓవరాల్గా తెలంగాణ ప్రజల ఫోకస్ను భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్కు షిఫ్ట్ చేస్తున్నారు బండి సంజయ్. ఈ సవాల్కు 48 గంటల డెడ్లైన్ పెట్టి టీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అనుకున్నట్టుగానే వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి కామెంట్లకు కౌంటర్లు వేశారు కూడా. పైగా వరంగల్లోనూ ఎంఐఎంను టార్గెట్ చేస్తున్నారు. 20 శాతం బలం ఉన్న ఎంఐఎం కావాలా, 80 శాతం ప్రజల మద్దతు ఉన్న బీజేపీ కావాలా తేల్చుకోండంటూ ప్రచారం స్టార్ట్ చేశారు.
మొత్తానికి తెలంగాణలో ఎలా పాగా వేయాలనుకున్నారో అదే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అర్బన్ ఏరియాల్లో బీజేపీకి పట్టుంది. దాన్ని అధికారంలో కూర్చునేంత వరకు తీసుకెళ్లాలన్నది బండి టార్గెట్. అందుకే, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఏం చేసైనా సరే టీఆర్ఎస్ను తన ట్రాప్లో లాగాలన్నదే బండి సంజయ్ ప్లాన్. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ఎంత వద్దనుకున్నా బండి ట్రాప్లో పడింది టీఆర్ఎస్. బండి కామెంట్ చేస్తే దానికి కౌంటర్ వేయాల్సిన పరిస్థితికి వచ్చింది టీఆర్ఎస్. సో, వరంగల్ కార్పొరేషన్ను టార్గెట్ చేసిన బీజేపీ.. మున్ముందు ఎలాంటి దూకుడుతో వెళ్తుందో చూడాలి.