Munugode: మునుగోడు ఎన్నికలు.. నగదు ఇస్తేనే ఓట్లేస్తామంటూ..
Munugode: మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నంకు పుంజుకుంది.;
Munugode: మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నంకు పుంజుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 41.3శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడులో మొత్తం 2 లక్షల 41 వేల 805 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 99 వేల 780 ఓట్లు పోలైయ్యాయి.
మరోవైపు నో మనీ.. నో ఓట్ అంటూ ఏకంగా పోలింగ్నే బహిష్కరించారు మర్రిగూడ మండలం అంతపేట గ్రామస్థులు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంచారని.. మరికొందరికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నగదు ఇస్తే తప్ప పోలింగ్ సెంటర్లకు వెళ్లేది లేదని కుండ బద్దలు కొట్టేస్తున్నారు..
ఇక చండూరులోని పోలింగ్ బూత్- 201లో ఓ మహిళ ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఓటు వేసేందుకు లోపలికి వెళ్తుండగా గేటు వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. కాలు జారడంతో ఆమె కిందపడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు, పోలీసులు ఆమెకు సాయం చేసి జాగ్రత్తగా తీసుకెళ్లారు.
ఇక ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ఓటర్లు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. క్యూలో నిలబడలేక కొందరు మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాల ముందే సేద తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంస్ధాన్ నారాయణపురం మండలం అల్లందేవి చేరువులో కూడా పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ కూడా ఈవీఎంలు మొరాయించాయి.
గత 2018 ఎన్నికల్లో 91.5 ఓటింగ్ శాతం నమోదైంది. అయితే..ఈసారి కూడా మునుగోడులో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్స్ 318 ఉండగా ఎన్నికల బరిలో 47 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో పాటు..వీటిలో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక కోసం ముగ్గురు కేంద్ర పరిశీలకులు పరిశీలిస్తున్నారు.
బందోబస్తు కోసం 3300 పోలీసులు, 15 కేంద్ర బలగాల మోహరించినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.